కేజ్రీవాల్ పార్టీ నుండి కాంగ్రెస్‌కు ఊహించని ఆఫర్!

  • 2024 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచన
  • అలా అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్‍‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయదని ఆఫర్
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సౌరభ్ భరద్వాజ్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఊహించని ఆఫర్ వచ్చింది! 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుండా తమకు అండగా ఉంటే, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో తాము పోటీకి దూరంగా ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కీలక ప్రతిపాదన ముందుకు తెచ్చారు. తమ ఈ ఒప్పందానికి కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేస్తే, తాము అందుకు సిద్ధమేనని తెలిపారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి గెలిస్తే దేశం నియంతృత్వంలోకి వెళ్లడం ఖాయమన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను ఉపయోగించి విపక్ష నేతలను జైల్లో పెట్టిస్తారని ఆరోపించారు. 

సౌరభ్ భరద్వాజ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆలోచనలను కాంగ్రెస్ కాపీ కొడుతోందన్నారు. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలను, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందన్నారు.

AAP
Congress
Rahul Gandhi
Lok Sabha

More Telugu News